సహృదయ సాహితి, విశాఖపట్నం 46వ వార్షికోత్సవ సందర్భంగా జాతీయ స్థాయి కవితల పోటీకి పంపిన కవిత
శీర్షిక : " తడి నయనాలు "
ఎదురుగా ఓ మనిషి...
నయనాలు తడిలో బాగా నానినట్టున్నాయ్..
ఒంటి కాలు కదిపితేనే కదిలే
మూడుచక్రాల జీవితపు బండి
ముందుకెల్లనని మొరాయిస్తున్నట్టుంది
పంటిబిగుతున చిక్కిన పెదాలు రోషంగా
రోదించనని వారిస్తున్నట్టున్నాయ్
బరువెక్కిన ఆ గుండె దరువును తగ్గించాలనే
తపన నాలో ఆ మోముపై చిందే చిరునవ్వును చూడాలని తహ తహ లాడుతుంది
ఓ మారు మాట కలపనా..
పలకరింపు ఊరటనిస్తుందేమో!
భుజంతట్టి పక్కన నిలబడనా..
భరోసాగా ఉంటుందోయేమో?
అడుగు ముందుకేసే ధైర్యమే రావడం లేదు
కన్నీరునే తుడిచేసేంతా కాసులు నాతో లేవు
ఓ రిక్షా! అనగానే
మెడనున్న కండువతో ముఖం తుడిచాడు
అద్దం వైపు చూసుకొని ఓ నవ్వు నవ్వాడు
వస్తున్నా సారంటూ ఆప్యాయంగా పలికాడు
పని ఒప్పుకొని పాడుకుంటూ వెళ్ళిపోయాడు
సాటి మనిషి నొప్పిని చూడగలిగినా
ఓదార్చలేని నిరుపేదలుగా.. ఓర్చుకుంటాడులే అనుకునే నిస్సహాయకులుగా..నాలాంటి వారే
సమాజంలో ఎక్కువవుతున్నారనే బాధే మిగిలింది లోలోన..!
✍️అనిర్వ✍️
@ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment