అనంత సాహితీ వేదిక
పద/వాక్య కవిత్వ పోటీకి
తేది : 12/2/26
అంశం: నిశ్శబ్దం రాసిన కవిత
రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి
ఊరు :కోవూరు,నెల్లూరు జిల్లా
చరవాణి : 9542000079
శీర్షిక : మరణ శాసనమే!
ఏమైందో ఆ తల్లికి
ఎంత గాయమైందో ఆ గుండెకి
ఎన్ని ప్రశ్నలు అలుపులేకుండా దాడి చేసాయో?
హృదయపు ఘోష ఒంటరితనంలో
అలసిపోయిందా? ఆగిపోయిందా?
ప్రసవ వేదనలో యుద్ధమే చేసి ప్రాణమే నిలుపుకున్నదే!
ప్రాణం విలువ తెలియదనుకుందామా?
బిడ్డగా ఇల్లాలిగా తల్లిగా ఉద్యోగిగా చూసిన ఏ జీవితం కూడా ఆపలేక తలవంచి దారిచ్చిందా ?
పని భారమా? భవిష్యత్తుకై భయమా ?
బ్రతుకులో ఆనందమే లోపమా?
ఏ విషపు కాటు మనసును మలినం చేసిందో!
ఏ నిస్సహాయపు వేషము అస్తమయం వైపు నడిపించిందో!
అంతు చిక్కని అయోమయమే అంతా!
ఏ సమాధానము సంతృప్తినివ్వలేదా?
ఏ బంధము చొరవ చూపి భరోసానివ్వలేదా?
ధైర్యము ఎలా కూడబెట్టుకుందో
బిడ్డలకు ఏమి చెప్పి ఒప్పించుకుందో
తనువూ చాలించాలనే నిర్ణయించుకుంది.
క్షణకాలంలో ఇనుప చక్రాల రైలు బండి
కూతలేసుకుంటూ యమపాశమై
ఎంత దూరం ఈడ్చిందో ఆ ప్రాణాలకై
రక్తపు మడుగులలో శబ్దాల మాటున
ఓ నిజం స్తబ్ధుగా గాలిలో నిలిచిపోయింది
ఎవరు ఎక్కడ విననంతగా
దిగ్బ్రాంతికి లోనూ చేసింది
సమాజమే ఓడించిన మహిళగా
నిశ్శబ్దంలో ఓ మరణ శాసనమే రాసింది...!
✍️అనిర్వ✍️
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...
No comments:
Post a Comment